కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా జనాభా పెరిగిపోతుందా..! ఏందీ న్యూస్ అని కోపంగా నొసలు విరుస్తున్నారా.? ఇదినేను చెప్పింది కాదు ఐక్యరాజ్య సమితి పేర్కొన్న విషయం. డిసెంబర్ నాటికి ఓ రెండు కోట్ల మంది ఇండియాలో పుట్టేస్తారట. మన దేశంలో యువత ఎక్కువే. అదిగాక సంక్రాంతి మూఢాలు వెళ్లిపోయాకా. పెండ్లిళ్లు జరిగాయి. ఉగాధి తర్వాత కూడా జరిగేదుండే కానీ కరోనా.. లాక్డౌన్ కారణంగా ఆగిపోయాయి. జరగని పెండ్లిళ్ల గురించి పక్కన పెడితే.. మార్చి 21 నుంచి దేశంలో లాక్డౌన్ విధించారు. ఆ రోజు నుంచి 90 శాతం మంది జనాభా ఇండ్లలోనే ఉండిపోయారు. యువజంటలు, మధ్యస్త జంటలు కూడా ఇండ్లలోనే ఉండిపోయారు.. వాళ్లకు వేరే ‘పనేముంది’ అన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి లెక్కలేసినట్టుంది. మార్చిలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి లెక్కిస్తే డిసెంబర్ నాటికి 9 నెలలవుతుంది. తల్లి గర్భం నుంచి శిశువు జన్మించేదీ 9 నెలల తర్వాతేగా. ఆత్రమున్న శిశువులు ఏడెనమిది నెలలకు కూడా తల్లిగర్భంలో ఉండలేమని వచ్చేస్తారునుకో అది వేరే విషయం. లెక్క ప్రకారం 9 నెలలే కాబట్టి అప్పటిలోగా ఇండియాలో ఓ రెండుకోట్ల మంది పుట్టేస్తారని లెక్క వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోనే ఎక్కువ మంది పుట్టేస్తారని లెక్కలేసింది.
ఈ తొమ్మది నెలల కాలం నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 116 మిలియన్ల మంది జన్మించే అవకాశం ఉందని యూనిసెఫ్ అంచనా వేసింది. మార్చి 11న కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన తర్వాత 40 వారాల్లో వీరంతా జన్మించే అవకాశం ఉందని ఓ లెక్క. కరోనా వైరస్ కారణంగా స్తంభించిపోయిన వైద్య సేవలు, అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జన్మించే శిశువులు, గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఆందోళన వ్యక్తం చేసిందనుకో అది వేరే విషయం.
ఏఏ దేశంలో ఎంత మంది పుట్టేస్తారంటే…
బార్డర్ పంచుకుంటున్న ఇండియా, చైనా, పాకిస్థాన్ (మధ్యలో నైజేరియా ఉందనుకో) దేశాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని లెక్క. డిసెంబరు 16 నాటికి ఇండియాలో 20.1 మిలియన్ల మంది పుడతారని అంచనా. రెండోస్థానంలో స్థానంలో చైనా ఉండగా. ఆదేశంలో 13.5 మిలియన్లు, నైజీరియా (6.4 మిలియన్లు), మూడో స్థానంలోని పాకిస్థాన్లో 5 మిలియన్లు, ఇండోనేషియాలో 4 మిలియన్లు పుట్టేస్తారని లెక్కలేసింది యూనిసెఫ్. మిగతా దేశాల్లో పుట్టేవారి సంఖ్య ఉన్నా అన్ని రాయలేము కాబట్టి ఇంతటితో ముగిద్దాం.