Home breaking news ఒక్క రోజులోనే ఈనాడులో ఎంత మార్పు– నిన్నటి వరకూ ఎడిటర్ రామోజీ.. నేడు ఫౌండర్

ఒక్క రోజులోనే ఈనాడులో ఎంత మార్పు– నిన్నటి వరకూ ఎడిటర్ రామోజీ.. నేడు ఫౌండర్

1259
1

–వికాస్​ రుషి

ప్రముఖ దినపత్రిక ఈనాడులో అసాధరణమైన ఒక నిర్ణయం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. నిన్నటి వరకూ ఈనాడుకు చీఫ్​ ఎడిటర్​గా ఉన్న రామోజీరావు పక్కకు తప్పుకున్నారు.  ఇప్పుడు ఫౌండర్​గా మారిపోయారు.  ఇది పేపర్​ వెనుక పేజీలో కింద ఉన్న వివరాలు చూస్తేనే కాని ఎవరికి తెలియదు. ఈనాడుకు ఇప్పటి నుంచి తెలంగాణకు, ఏపీకి ఇద్దరు ఎడిటర్లు నియమితులయ్యారు. తెలంగాణకు డీఎన్​ ప్రసాద్​. ఏపీకి ఎం నాగేశ్వరరావు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటివరకూ ఒక్క తెలుగు పేపర్​కు ఇద్దరు ఎడిటర్లు ఉన్నది మొదట్లో  కమ్యూనిస్టు పార్టీ​ మార్కిస్ట్​ (సీపీఎం) ఆధ్వర్యంలో నడిచే ‘ప్రజాశక్తి’కి తొలుత కొన్ని రోజుల పాటు సాంకేతికంగా ఒక్కరే అయినప్పటికీ.. తెలంగాణ, ఏపీకి వేర్వేరు ఎడిటర్లను నియమించారు. ఆ తర్వాత ఆ పత్రిక రెండు ముక్కలైంది. ఏపీలో ప్రజాశక్తిగానే ఉంటే, తెలంగాణలో నవ తెలంగాణగా రూపుదిద్దుకున్నది. ఆ తర్వాత ఆంధ్రప్రభలో తెలంగాణకు వీఎస్సార్​ శర్మ, ఏపీకి సతీష్​చంద్రను నియమించారు. చివరకు పత్రిక ఓనర్​ ముత్తా గౌతమ్​ ఎడిటర్లుగా కొనసాగుతున్నారు. ఇందులో శర్మ వర్కింగ్​ జర్నలిస్ట్​.

ఇప్పుడు ఈనాడు వద్దకు వద్దాం. ఈ పత్రిక ప్రచురణ ప్రారంభమైనప్పటి నుంచి రామోజీరావు 13–12–2019 వరకూ నిరాకంటంగా ఎడిటర్​గా కొనసాగుతూనే ఉన్నారు. 14–12–2‌019  నుంచి ఈ పత్రికకు ఇద్దరు ఎడిటర్లు వచ్చారు. రామోజీరావు ఫౌండర్​గా మిగిలిపోయారు. అయితే వైఎస్​ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. ఈనాడుకు అండగా ఉన్న ప్రధాన ఆర్ధిక వనరు మార్గదర్శి చిట్​ఫండ్​ను దెబ్బకొట్టారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్​కుమార్​ మార్గదర్శిపై పోరాటం చేశారు. ఆ దెబ్బకు ఈనాడు, ఈ టీవీ గ్రూప్​లో సగానికి ‘బ్లాక్​స్టోన్​’ కంపెనీకి విక్రయించారని, ఆ తరువాత రిలయన్స్​ గ్రూప్​ వచ్చిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టీవీ గ్రూప్​లో సీరియల్స్​ ప్రసారం చేసే ఛానల్​ మాత్రమే రామోజీరావు కుటుంబానిదని ఓపెన్​ సీక్రెట్​. మిగిలినవన్నీ.. రిలయన్స్​కు ఇచ్చేశారని ఒక ప్రచారం. సోమాజీగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయం నుంచి అన్ని విభాగాలు ఫిల్మ్​సిటీకి మారిపోయాయి. ఇప్పుడు ఈ ఎడిటర్​ మార్పు అనేది రామోజీరావుకు వయసు మీద పడ్డదనేనా..? లేక మరేమన్నా కారణాలున్నాయా..? అన్నది అంత ఈజీగా బయటపడే అంశమూ కాదు. ఏది ఏమైనా రామోజీరావు స్థాయిలో ఒక వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసిన వారు తెలుగులో కన్పించరన్నది మాత్రం వాస్తవం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here