కష్టాలే లేకుండా అన్ని సుఖాలే ఉంటే.. ఇంటోడు సహా ఎవడూ గుర్తుకు రాడన్నది ఉత్తగనే అన్లే. కష్టాలు రాగానే.. అందరూ గుర్తు కొస్తారు. చివరకు దేవుడు కూడా. దేవుడిని కోరుకునే కోరికలు కూడా అట్లనే ఉంటాయి. స్టూడెంట్ అయితే పాస్ అయితే తల నీలాలు ఇస్తానంటడు. అదే కాంట్రాక్టర్ అయితే పలానా కాంట్రాక్ట్ వస్తే అంటడు. దొంగ అయినా సరే పడతలు పడ్తే అంటడు. ఇక రాజకీయ నాయకుడు అయితే ఎన్నికలప్పుడు మూలకు కూసున్న ముసలమ్మ దగ్గరకు వచ్చి అవ్వా బాగున్నావే అంటడు. నేనే గెలిస్తే సామీ నీ దగ్గరకు వస్త అంటడు. తెలంగాణలో వచ్చే ఏడాది, సెంటర్లో మళ్లొచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. ఇక పాదయాత్రలు సీజన్ మొదలై.. తెలంగాణలో కొట్టుకొని కేసులు పెట్టుకునే కాడికి వచ్చె. 2019 ఎన్నికలకు ముందు రాహుల్ తీరే వేరు. పక్కనున్నోళ్లు, సోషల్ మీడియా లెక్కలతో నేనే ప్రధాని అని కలలు కన్నడు. చివరాఖరకు ఒక తాన ఓడి, కేరళల గెలిచిండు. 2019 ఎన్నికల తర్వాత కాడి ఎత్తేసి కూర్చున్నడు. ఒక్కొక్క రాష్ట్రం కాంగ్రెస్ చేజారి పోతోంది. మళ్లొచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులు.. కష్టాల మీద కష్టాలు. ఇక తప్పదని.. కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో’ తొవ్వ పట్టాడు. జనాలను కలుస్తున్నడు. ఆళ్లు చెప్పేదీ వింటున్నడు. చెప్పేదీ చెబుతున్నడు. అయినా ఎక్కడో లోటు కన్పించినట్టుంది. ఎందుకైనా మంచిదని అచ్చం బాబాల లెక్క గడ్డం పెంచి దేవుడిని కూడా కలుస్తున్నడు. బోర్ల పండుకొని కొలుస్తున్నడు. ఈ గడ్డం పెంచుకోవడం వల్ల గ్లామర్ బాయ్ క్రెడిట్ పోయింది. ఏ క్రెడిట్ పోయినా ప్రధాని కుర్చీ రావాలన్నదే లెక్క. ఆ లెక్క కోసమే అప్పుడప్పుడూ గుర్తుకొచ్చే జనాలు గుర్తుకొచ్చారు. ఎన్నడూ గుర్తుకు రాని దేవుడు కూడా గుర్తొచ్చాడు. అధ్యక్షుడు కాని అధ్యక్షా.. మైనార్టీ ఓట్లకు గండి పడ్తుతుందేమో జర దేఖో.
