పక్కోడి మీద రాయి వేయడం ఈజీ. ఇదంతా వాళ్ల వల్లే అయింది. మేమేం చేస్తాం చెప్పండి అన్నట్టుగా మాట్లాడేస్తారు. కరెక్టే వాళ్లేదో చేసిండ్రనే కదా మిమ్ములను ముందుకు తీసుకొచ్చిందంటే చేస్తున్నాం ఇంకా టైముంది అని మాత్రం చెప్పేస్తారు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లపై కరెక్ట్గా ప్రధానమంత్రి మోదీ ఇట్లనే చెప్పేశారు. ఇంధనం కోసం మన దేశం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోందని, ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఈ అంశంపై శ్రద్ధ తీసుకోలేదన్నారు. తమిళనాడులో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ మాట్లాడుతూ, 2019-–20 ఆర్థిక సంవత్సరంలో మన దేశ అవసరాల్లో 85 శాతం ఆయిల్ను, 53 శాతం గ్యాస్ను దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. అయితే మనం దీనిపై చాలా ముందుగానే దృష్టి సారించి ఉంటే మధ్య తరగతి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదని చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
ఇదంతా నిజమే మోదీ సార్.. మనం కుర్చీ మీద కూర్చుని ఏడేండ్లవుతోంది.. ఇన్నేండ్లలో ఏం చేసినట్టో. అంతకు ముందు కూడా అంటే కాంగ్రెస్ హయాంలో ఇదే స్థాయిలో లేదా ఇంతకంటే ఎక్కువ దిగుమతి చేసుకొని ఉండొచ్చు.కానీ ఈ స్థాయిలో రేట్లు లేవుగా. బీజేపీ గవర్నమెంట్ వచ్చింతర్వాత లీటర్ పెట్రోల్ రేటు 40 రూపాయలు పెరిగి 100కు చేరింది. ఈ పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న ఎక్సైజ్ టాక్స్ వగైరా కారణంగా ఈ రేంజ్కు చేరుకుంది. కనీసం ఈ టాక్స్ తగ్గించినా వీటి రేటు తగ్గుతుంది. ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందిగా కనీసం ఆ ఆలోచన కూడా వీళ్లు చేయడం లేదు. 2025 నాటికి పెట్రోల్లో చెరుకు నుంచి తీసే ఇథనాల్ను ఇంకా ఎక్కువగా కలుపుమంటూ చెప్పుకొచ్చారు. అంటే అప్పటి దాక ఈ రేట్ల మంట భరించాలన్నట్టేగా హథావిధి. ఎంత కష్టమొచ్చే పబ్లిక్కు.